Dr. Dattaiah Attem
Dr. Dattaiah Attem
డా. అట్టెం దత్తయ్య లక్ష్మి, మల్లయ్యలకు 26.12.1983లో కామారెడ్డి జిల్లా, లింగంపేట్ మండలం, శట్పల్లి గ్రామంలో జన్మించారు. వ్యవసాయ కుటుంబం. కామారెడ్డి పి.వి.పి. ఓరియంటల్ కళాశాలలో బి.ఓ.ఎల్.పూర్తి చేసుకుని, ఉస్మానియా విశ్వవిద్యాలం నిజాం కళాశాలలో ఎం.ఏ.చేసి, తెలుగు విశ్వవిద్యాలయం భాషాశాస్త్ర విభాగంలో ఆచార్య వై.రెడ్డి శ్యామల పర్యవేక్షణలో ఎం.ఫిల్. చేసారు. తిరిగి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య సాగి కమలాకర శర్మ పర్యవేక్షణలో పిహెచ్.డి. పూర్తిచేసారు. అనంతరం ఏ.వి. కళాశాల తెలుగుశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా 2021-2022 వరకు, అదే సంవత్సరం కొంతకాలం నిజాం కళాశాలలో పనిచేసారు. కళ్లం (సాహిత్య వ్యాసరాశి) (2018), తెలంగాణ బి.సి.వాద సాహిత్యం (2021), మహాభారతంలో సంవదాలు - సమగ్ర పరిశీలన (సిద్ధాంత గ్రంథం) (2022), పట్నమొచ్చిన పల్లె - భాషా పరిశీలన’ (ఎం.ఫిల్.గ్రంథం) (2022) అనే పుస్తకాలను రచించారు. వీరి సంపాదకత్వంలో ‘నిత్యాన్వేషణం (2018), కమలాకరం (2021) సారాంశం (1వ సంపుటి 2021, 2వ సంపుటి 2022), తెలంగాణ సాహిత్య గ్రంథసూచి (2024) వెలువడ్డాయి. శిలాక్షరం (2019), తెలుగు సామెతలు సమాలోచన (2021), కామారెడ్డి జిల్లా సర్వస్వం (2023) ‘గురుతరం’ (2024), సాహితీ శ్రీరంగం (2024), విమర్శానారామం (2025), అక్షరాకాశం (2025) గ్రంథాలకు సహసంపాదకులుగా వ్యవహరించారు. ఆలోకనం (2017), శతవాసంతిక (2019) తెలంగాణ సాహిత్యం-`సమాలోచన (2019) సహాయ సంపాదకులుగా ఉన్నారు. అంబెద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ఆచార్య జి.రాంరెడ్డి దూరవిద్యా కేంద్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం పి.జి.పాఠ్యాంశాల రచయిత. 80కి పైగా వివిధ పత్రికలలో వ్యాసాలు, 60కి పైగా జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పత్రసమర్పణలు చేసారు. 2022లో ‘కాలువ మల్లయ్య స్ఫూర్తి పురస్కారం’, ‘తెలంగాణ సాహిత్య కళాపీఠం’ వారు అందించే ‘ప్రతిభా పురస్కారం’ అందుకున్నారు. మూడు జాతీయ సదస్సులకు సహ సంచాలకులుగా వ్యవహరించారు. ‘మూసీ’ తెలుగు మాస పత్రికకు సహ సంపాదకుడిగా పనిచేస్తున్నారు. ‘మూసీ సాహిత్యధార’ ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తెలుగు సహాయ ఆచార్యులు పనిచేస్తున్నారు.
Dr. Dattaiah Attem is Assistant Professor in Telugu at Sri Venkateshwara College, Univeristy of Delhi. Dr Dattaiah has authored several books titled 'Kallam', 'Telangana BC Vada Sahityam', 'Mahabharata Samvadalu-Samagra Parishilana', 'Patnamochina Palle- Basha Parisheelana' etc., Edited and compiled 'Nityanveshana', 'Kamalakaram', 'Saramsham 1 & 2' 'Shilaksharam', 'Telugu Sametalu Samalochana', 'Kamareddy Sarvasvam', 'Gurutaram' etc., as a co editor published books like 'Shatavasantika' Osmania University Telugu Department 100 years souvenir, 'Alaokanam' etc., Recently, he has edited for Telangana Sahitya Academy titled 'Telangana Grantha Sarvasvam', an encyclopaedia of Telangana publications. More than eighty research articles have been published, and participated in sixty national and International seminars. At present working as co-editor to MUSI Telugu journal.
చదువులమ్మ ‘దత్త’ పుత్రుడు
ఇటీవల వచ్చిన తెలుగు సినిమా ’’కొండపొలం‘ సినిమాను మీరందరూ చూసే ఉంటారు. అందులో ఉద్యోగం సాధించడానికి పట్నం వెళ్లిన ఓ యువకుడు, తన గ్రామీణ నేపథ్యంతో నగర విద్యార్థులతో పోటీపడలేక ఆత్మవిశ్వాస లేమితో ఉంటాడు. సెలవుల్లో తన ఊరికి వెళ్లి ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో తమ వృత్తి అయిన గొర్రెలు కాసే పనిలో భాగంగా కొండపొలం(మన్నెం)కు తండ్రితో పాటు వెళ్తాడు. అడవిలో అతడికి ఎదురైన అనుభవాలతో ఆ యువకుడి గుండె నిబ్బరం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇది ఒక నవల ఆధారంగా తీసిన సినిమా. అయితే ఇది నిజజీవితంలో జరిగితే.. అది పెద్ద విజయగాథే అవుతుంది. అలాంటిదే మన యాదవ బిడ్డ "అట్టెం దత్తయ్య జీవిత విజయ ప్రస్థానం.. అదెంటో చదవండి... (అతడి మాటల్లోనే)
నా పేరు అట్టెం దత్తయ్య. తల్లిదండ్రులు లక్ష్మి, మల్లయ్య. గ్రామం శట్పల్లి, మండలం లింగంపేట్, కామారెడ్డి జిల్లా నా జన్మస్థానం. ప్రారంభ, ప్రాథమిక, మాధ్యమిక (7వ) తరగతి వరకు సొంత గ్రామం శట్పల్లిలో చదువుకున్నాను. ఇంటి పరిస్థితుల వల్ల ఏడవ తరగతి పూర్తి కాగానే మేకల కాపరినయ్యాను. చదువును మాన్పించి మాకు ఉన్న 40 మేకల వెంట పంపించారు. అది మా కులవృత్తి. అప్పటి మా ఇంటి పరిస్థితుల అవసరం కూడా. మేకల కాపరిగా ఏనిమిదేండ్లు గడిచాయి. ఆ కాపరి జీవితంలో ఎన్నో అనుభవాలు. బాధలు, సమస్యలు, అవమానాలు, ఆశలు. నాతోటి వారంతా ముద్దగా తయారు అయ్యి పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తుంటే లోలోపల బాధపడిన రోజులు, కంటనీరు పెట్టిన గంటలు ఎన్నో...
కాపరిగా ఉన్నప్పుడు మేకల మేత కోసం వివిధ ప్రాంతాలకు మన్నెం పేరుతో వెళ్లేవాడిని. అందులో భాగంగా నేను కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు మూడు సంవత్సరాలు వెళ్ళాను. అక్కడ ఫారెస్ట్ అధికారులతో దెబ్బలు, నక్సలెట్లతో బెధిరింపులు, వివిధ అధికారులతో ఎన్నో కష్టాలు ఎదుర్కున్నాను. కాపరిగా నేను చేసిన మంచి పని చిన్న చిన్న కథల పుస్తకాలు, వేమన, సుమతి వంటి శతకాలు, బ్రహ్మంగారు, వెంకటదాసు వంటి వారి కీర్తనలు కంఠస్థం చేయడం. కారణం మా గ్రామంలో భజనకు, స్వాధ్యయకు వెళ్ళే అలవాటు ఉండేది. అవే నన్ను అక్షరాలను మరువకుంట చేసాయి.
నా జీవితం మలుపు తిరిగింది ఇలా .... గోచి గొంగడితో ఒకరోజు సాయంత్రం మేకల దగ్గరనుండి ఇంటికి వెళ్తున్న. చిన్నప్పటి నా సహ అధ్యాయి ఇఫ్తేకర్ డిగ్రీ కామారెడ్డిలో చదువుతున్నాడు. అవి సెలవు రోజులు కావడంతో మా ఊరికి వచ్చాడు. అతడు నడుచుకుంటు వెళ్తున్న నన్ను చూసి పిలిచాడు. నేను చిన్నప్పుడు చదువుతున్న సమయంలో గల చురుకుతనాన్ని గుర్తుచేసాడు. ప్రైవేటుగా పదవ తరగతి పరీక్ష రాయుమని సలహ ఇచ్చాడు. ఇతను ఇచ్చిన సలహతో ఇతరులన తెలుసుకుని యూసుఫ్ సార్ సహాయంతో లింగంపేటలో ప్రైవేటుగా పదవ తరగతి పరీక్ష పీజు కట్టిన.
చదవడం ఎలా అని ఆలోచించినపుడు.... నాకు చిన్న తనంలో ట్యూషన్ చెప్పిన రత్నాకర్ సార్ ని ఒకరోజు ఉదయం లింగంపేట్ వెళ్లి కలిసిన. మేకలను సాయంత్రం కొట్టంలో తోలిన తర్వాత వచ్చి చదువు చెప్పాలని బ్రతిమాలిన. దానికి ఆయన అంగీకరించి రోజు సాయంత్రం మా గ్రామానికి వచ్చి, నేను మేకలు కొట్టంలో తోలేంత వరకు నిలబడి, నన్ను ఒక రెడ్డీల ఇంటికి తీసుకుని వెళ్లి చదువు చెప్పేది. కారణం మా ఇళ్లు చాలా చిన్నది. ఆయనకు అనుకూలంగా ఉండేది కాదు. నాతో పాటు ఆ రత్నాకర్ సార్ దగ్గరకు ట్యూషన్ కు మా ఊరి రెగ్యులర్ గా చదువుతున్న విద్యార్థలంతా వచ్చేవారు. నేను పొద్దంతా మేకలతో తిరిగి, మేకలతోనే మునిగి ఉండడంతో కొంత రొచ్చు వాసన వచ్చేది. దానితో కొందరు తోటి విద్యార్థులు కూడా అవమనించేవారు. అయినా నాకు లక్ష్యం చదవడమే. అలా కష్టపడి చదివి పరీక్షరాసాను. పాసయ్యాను.
ఇంటర్ చదవాలి. మా నాన్నను రెగ్యులర్ గా చదువుతా పంపమని బ్రతిమాలాను వినలేరు. మా ఆర్థిక పరిస్థితులు అలాంటి. అయినా చదవాలి. ఎలా అనుకుని మళ్ళి యూసుఫ్ సార్ ని వెళ్ళి కలిసా. ఇంటర్ లో కూడా ప్రైవేటుగా జాయిన్ చేసాడు. కాలేజీకి వెళ్ళే అవకాశం లేదు. అయినా దీక్షగా చదివాను. ఇంటర్ కూడా పాస్ అయ్యాను. ఇకా మా నాన్నకు నా చదువు మీద నమ్మకం కలిగింది. డిగ్రీ వేరే పని ఏదైనా చేసుకుంటూ చదువుకో అన్నారు. మా ఊరిలో కామారెడ్డి నైట్ కాలేజీలు చదువుకుంటున్న మిత్రుని సలహతో ఆ ఓరియంటల్ కాలేజీలో చేరాను. ఒక సంవత్సరం పాటు పొద్దున పాల వ్యాపారం చేసుకుని సాయంత్రం కాలేజీకి వెళ్ళి చదివిన.
డిగ్రీ మొదటి సంవత్సరంలో మొత్తం కాలేజికే మొదటి ర్యాంకు సాధించిన. దానితో మరింత నమ్మకం పెరిగింది. నా ర్యాంకును చూసి తెలిసిన మిత్రుడు ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్ గా పెట్టించాడు. పొద్దంతా చదువు చెప్తూ కాలేజీలో చదువుకున్న. మంచి స్థాయిలో డిగ్రీ పూర్తి చేసుకున్న. డిగ్రీ అనంతరం తెలుగు పండిత్ ట్రేనింగ్ నిజామాబాద్ లో పూర్తి చేసిన. టి.పి.టి. తర్వాత ఉస్మానియా విశ్వద్యాలయంలో ఎం.ఏ. తెలుగు ప్రవేశపరీక్ష రాసి మంచి ర్యాంకు సాధించాను. క్యాంపస్ సీటు వచ్చింది. చదువు సాఫిగా సాగుతుంది. నాకు పి.జి.పాఠాలు చెప్తున్న ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ గారు నన్ను బాగా దగ్గరి తీసారు. ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఎం.ఏ.పూర్తి చేసాను. యు.జి.సి.నెట్, ఏ.పి.సెట్. వంటి నేషనల్ పరీక్షలు అన్నింటిలో ఉత్తీర్ణుడినయ్యాను. వెంటనే ఎం.ఫిల్.లో చేరి పూర్తి చేసాను. నేషనల్ ఫెలోషిప్ సాధించాను. దానితో పిహెచ్.డి.లో సాగి కమలాకరశర్మగారి పర్యవేక్షణలో ‘మహాభారతంలో – సంవాదాలు సమగ్ర పరిశీలన‘ అనే అంశం మీద చేరాను. కాల పరిమితికి అనుగునంగా ఐదు సంవత్సరాలలో పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మార్చి, 28, 2021 సమర్పించాను. నాకు తెలుగు శాఖ సెప్టెంబర్ 08, 2021న మౌఖిక పరీక్ష పెట్టి, డాక్టరెట్ ను ప్రకటించారు. నేను పి.జి.లో ఉన్నప్పటి నుండి మా ఆచార్యుని సహాయంతో సాహిత్య వ్యసాలు రాయడం ప్రారంభించాను. అవి ఇప్పటి వరకు వివిధ పత్రికలలో 80కి పైగా ప్రచురితం అయ్యాయి. ప్రత్యేకంగా రెండు పుస్తకాలు ప్రచురించాను. 1. ‘కళ్లం’ (సాహిత్య వ్యాసరాశి) 2018, 2. ‘తెలంగాణ బి.సి.వాద సాహిత్యం’ 2021. ఈ పుస్తకాలతో నాకు దక్కిన గొప్ప గౌరవం నేను రాసిన ‘తెలంగాణ బి.సి.వాద సాహిత్యం’ అనే గ్రంథాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం ఎం.ఏ. తెలుగు వారికి ‘రిఫరెన్స్ బుక్’గా ఎంపిక చేయడం నా అదృష్టం. పై రెండు పుస్తాకాలతో పాటు నేను సంపాదకుడిగా రెండు పుస్తకాలు, నేను సహాయ సంపాదకుడిగా నాలుగు పుస్తకాలు వచ్చాయి. తెలంగాణ ప్రసిద్ధ శాసన పరిశోధకుడు బి.ఎన్.శాస్త్రి ప్రారంభించిన ప్రసిద్ధ తెలుగు ‘మూసీ’ మాస పత్రికకు సహ సంపాదకుడిగా అవకాశం కలిగింది. పనిచేస్తున్నాను. ప్రపంచ తెలుగు తెలుగు మహా సభల సందర్భంగా తెలంగాణ అన్ని విశ్వవిద్యాలయాల నుండి ఒకే పరిశోధక విద్యార్థిగా నాకు ఒక వేదికకు సమన్వయ కర్తగా ‘కరదీపిక’లో అవకాశం లభించింది. వీటన్నింటితో పాటు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో ముప్పైకి పైగా పత్ర సమర్పణలు చేసాను.
(యాదవ వికాసం మాస పత్రికలో ప్రచురితం అయింది)
దినపత్రిక 15-08-2024